శ్రీనగర్, మార్చి 4: జమ్మూకశ్మీర్లోని కుప్వారా జిల్లాలో సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య భయంకరమైన కాల్పులు జరిగాయి. శుక్రవారం ప్రారంభమైన ఈ కాల్పులు 56 గంటల తర్వాత ముగిసాయి. ఉగ్రవాదులు పక్క ప్రణాళికతో బాగా జనసమ్మర్దమున్న ప్రాంతంలో నక్కడంతో భద్రతా సిబ్బందికి ఉగ్రమూకలను గుర్తుపట్టడం సవాలుగా మారింది. ఈ ఎన్కౌంటర్ లో ఐదుగురు భద్రతాసిబ్బంది ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు ఉగ్రవాదుల్ని బలగాలు హతమార్చాయి. ఈ ఘటనలో ఓ పౌరుడు సైతం బుల్లెట్ గాయాలతో చనిపోయాడు.
ఈ ఘటన పట్ల జమ్మూకశ్మీర్ పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.....లష్కరే తోయిబా సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదుల్ని భద్రతాబలగాలు మట్టుబెట్టాయని తెలిపారు. వీరిలో ఒకరు పాకిస్తానీ కాగా, మరొకరి వివరాలు తెలియాల్సి ఉందన్నారు.
భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య శుక్రవారం ప్రారంభమైన ఎన్కౌంటర్లో ఓ సీఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్, జవాన్, ఇద్దరు పోలీసులు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. ఈ ఉగ్రమూకల కాల్పుల్లో గాయపడిన జవాన్ శ్యామ్ నారాయణ్సింగ్ యాదవ్ ఆదివారం కన్నుమూశారన్నారు. అలాగే, వసీం అహ్మద్ మీర్ అనే పౌరుడు చనిపోయాడన్నారు.