న్యూఢిల్లీ, మార్చి 04: భారత వాయుసేన అధికారి అభినందన్ వర్ధమాన్ ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నాడు. పాకిస్థాన్ చేర నుండి విముక్తుడైన అభినందన్ కు ఢిల్లీలోని భారత వాయుసేన ఆసుపత్రిలో ప్రత్యేకంగా వైద్యపరీక్షలు నిర్వహించారు. శని, ఆదివారాల్లో ఈ వింగ్ కమాండర్ కు నిర్వహించిన వైద్యపరీక్షల్లో అనుమానపరిచే స్థితి గతులు ఏమి లేవని డాక్టర్లు తేల్చి చెప్పారు. అయితే తనకు చికిత్స అందిస్తున్న డాక్టర్లతో అభినందన్ చెప్పిన మాటలు వింటే ఆశ్చర్యమేస్తుంది.
తాను మళ్లీ యుద్ధవిమానం కాక్ పిట్ లోకి వెళ్లేందుకు కుతూహలంగా ఉన్నట్లు అభినందన్ వైద్యులకు తెలిపాడు. త్వరగా డిశ్చార్జ్ చేస్తే వెంటనే విధుల్లో మళ్ళీ ఎప్పటిలాగే కొనసాగుతానని చెప్పడంతో డాక్టర్లతో పాటు అక్కడే ఉన్న ఐఏఎఫ్ అధికారులు కూడా అబ్బుర పడ్డారు.
అంతకుముందు, అభినందన్ కు మెడికల్ టెస్టులు చేసిన డాక్టర్లు అతడి వెన్నెముక కింది భాగంలో స్వల్ప గాయం ఉన్నట్టు గుర్తించారు. దానివల్ల అతడి ఆరోగ్యానికి ఇబ్బందేమీ లేదని స్పష్టం చేసారు. అంతేకాకుండా, భారత వర్గాలు భయపడినట్టుగా అతడి శరీరంలో ఎలాంటి ఎలక్ట్రానిక్ బగ్స్ లేవని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు.