హైదరాబాద్, మార్చ్ 3: ఈ రోజు సైబర్ క్రైమ్ పోలీసులు మాదాపూర్ లోని ఐటీ గ్రిడ్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. ఐటీ గ్రిడ్లో పనిచేస్తున్న నలుగురు ఉద్యోగుల డేటా చోరీ చేస్తున్నారనే ఫిర్యాదుపై వారిని సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా ఐటీ గ్రిడ్లో పనిచేస్తున్న భాస్కర్ అనే వ్యక్తి కనిపించడం లేదని గుంటూరు పోలీసులకు ఐటీ గ్రిడ్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. భాస్కర్ కోసం మాదాపూర్లోని అయ్యప్ప సోసైటీలోని ఐటీ గ్రిడ్ కార్యాలయానికి ఏపీ పోలీసులు వచ్చారు. అయితే డేటా చోరీ కేసులో భాస్కర్ను అదుపులోకి తీసుకొన్నట్టు సైబరాబాద్ పోలీసులు ఏపీ పోలీసులకు వివరించారు. అయితే భాస్కర్ను తమకు అప్పగించాలని తెలంగాణ పోలీసులను ఏపీ పోలీసులు కోరగా దానికి తెలంగాణ పోలీసులు అంగీకరించలేదు. కాగా ఐటీ గ్రిడ్ వ్యవస్థాపకుడు ఆశోక్ పరారీలో ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు.