ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తెరాసలోకి జంప్?

SMTV Desk 2019-03-04 16:18:11  TRS, Congress MLA, Athram Sakku

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు (ఆసిఫాబాద్‌), రేగా కాంతారావు (పినపాక) తెరాసలో చేరబోతున్నారు. ఆత్రం సక్కు ఈ విషయం స్వయంగా నిన్న ప్రకటించారు. త్వరలోనే సిఎం కేసీఆర్‌ సమక్షంలో తెరాసలో చేరుతామని, అవసరమైతే తమ పదవులకు రాజీనామాలు చేసి మళ్ళీ పోటీ చేస్తామని సక్కు చెప్పారు.

త్వరలో జరుగబోతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి ఓ అవకాశంగా కాక అగ్నిపరీక్షగా మారవచ్చునని ఊహించినట్లుగానే జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు ఎమ్మెల్సీలు పదవీ విరమణ చేస్తుంటే, ఎమ్మెల్యేల కోటాలో ఒకే ఒక ఎమ్మెల్సీను గెలిపించుకొనే స్థితికి దిగజారింది. ఇప్పుడు ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పార్టీ వీడినట్లయితే, పార్టీ మరింత బలహీనపడటమే కాకుండా ఒక్క ఎమ్మెల్సీను కూడా గెలిపించుకోలేకపోతుంది. లోక్‌సభ ఎన్నికల నాటికి మరికొంత మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తెరాసలోకి వెళ్ళిపోవచ్చుననే ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. కనుక లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యేనాటికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది ఎమ్మెల్యేలు మిగులుతారో చూడాలి.