గత కొన్ని రోజులుగా అలీ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ ప్రచారం జోరందుకున్న విషయం తెలిసిందే. అలీ వైఎస్ ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ని కలిసిన సందర్భఃలో ఆయన వైఎస్సార్ సీపీలోకి వెళుతున్నారని అంతా ప్రచారం జరిగింది. ఆ తరువాత జనసేనాని కలవడం…కొన్ని రోజుల తరువాత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ప్రత్యేకంగా సమావేశం కావడంతో అలీ ఏం చేస్తున్నాడు? ఎందుకిలా కన్ఫ్యూజ్ చేస్తున్నాడు అనే చర్చమొదలైంది. అయితే అలీ ఈ ముగ్గురు కీలక నేతల్ని కలిసింది. పార్టీలో చేరడం కోసం కాదని తరువాత తేలింది.
అలీ సినిమాల్లోకి ప్రవేశించి 40 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో భారీ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దానికి ఆహ్వానించడం కోసమే వారిని అలీ కలిశారు. అయితే ఆ తరువాత జరిగిన కార్యక్రమానికి మాత్రం ఒక్క చంద్రబాబు మాత్రమే హాజరై అలీ రాజకీయ అరంగేట్రం గురంచి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అలీకి తెలుగు దేశం పార్టీకి విడదీయరాని అనుబంధం వుందని, అతను రాజకీయాల్లోకి వస్తే తాను అండగా వుంటానని సభాముఖంగా మాటిచ్చారు. ఈ మాటని నిలబెట్టుకోబోతున్నట్టు తెలుస్తోంది. త్వరలో అలీని తమ పార్టీలోకి చంద్రబాబు నాయుడు ఆహ్వానించబోతున్నారని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అలీని గుంటూరు ఈస్ట్ నుంచి పోటీకి దించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే అలీ స్కెచ్ ఫలించినట్టే. గత కొంత కాలంగా క్రియాశీల రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న అలీకి టీడీపీ రెడ్ కార్పెట్ పరుస్తుండటం, అలీ కూడా తన రాజకీయ ఎంట్రీపై చివరి నిమిషం దాకా సస్పెన్స్ ను మెయింటైన్ చేస్తుండటంతో రాజకీయ విశ్లేషకులు అలీ స్కెచ్ మామూలుగా లేదుగా అంటున్నారు.