వైరల్ అవుతున్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరి

SMTV Desk 2019-03-02 19:15:09  smrithi irani, central minister, smrithi irani children

న్యూఢిల్లీ, మార్చ్ 02: ప్రస్తుతం ఎగ్జామ్స్‌ సీజన్‌ నడుస్తోంది. పిల్లలతో పాటు పెద్దలకు కూడా ఇది పరీక్షా సమయమే. ఈ విషయంలో సామాన్యుల నుంచి ఉన్నత స్థాయిలో ఉన్న వారు కూడా ఒకేలా స్పందిస్తారు. ఇందుకు తాను మినహాయింపు కాదంటున్నారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. తొలిసారి ఇంటర్‌ బోర్డు ఎగ్జామ్‌ రాయబోతున్న కొడుకుకు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు స్మృతి ఇరానీ. ప్రస్తుతం ఈ స్టోరి తెగ వైరలవుతోంది.

స్మృతి ఇరానీ తన కుమారుడు జోహర్‌ని ఉద్దేశిస్తూ.. ‘నా తొలి సంతానం నేడు చాలా బాధ్యతయుతమైన పౌరుడిగా, ప్రేమ కలిగిన వ్యక్తిగా ఎదిగాడు. ఈ రోజు తొలిసారి ఇంటర్‌ బోర్డ్‌ ఎగ్జామ్స్‌ రాయబోతున్నాడు. తన కలలను నెరవేర్చు‍కునే ప్రయత్నంలో భాగంగా ఈ రోజు ఇంటి నుంచి త్వరగా బయలుదేరాడు. నాతో ఎప్పుడు ఓ మాట అంటుంటాడు.. అమ్మ నేను నీ కంటే పొడవయ్యాను అని కానీ తనకు తెలియదు.. తల్లి ఆశీర్వాదం బిడ్డ పెరిగేంత వరకూ మాత్రమే కాక జీవితాంతం తోడుంటుందని. సంతోషంగా ఉండు’ అంటూ పోస్ట్‌ చేసిన ఈ మెసేజ్‌ నెటిజన్లకు తెగ నచ్చింది. మీ కుమారుడు మీ పేరు నిలబెడతారు మేడమ్‌ అంటూ కామెంట్‌ చేస్తున్నారు నెటిజన్లు.