చంద్రబాబుపై మోహన్ బాబు ఫైర్...!

SMTV Desk 2019-03-02 16:12:16  Chandrababu, Mohan Babu, Fee Reimbursement, Tirupathi

తిరుపతి, మార్చి 02: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రముఖనటుడు మోహన్ బాబు విరుచుకుపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధుల విడుదల విషయంలో చొరవ చూపడం లేదంటూ ఆయన ఆరోపించారు. 2014-15 విద్యా సంవత్సరం నుంచి తమ సంస్థ విద్యార్థుల ఫీజులు ఇవ్వలేదని, అప్పుడప్పుడూ తమ కళాశాలకు భిక్షం మాత్రం వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు ఉదయం మోహన్ బాబు మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు తనకెంతో సన్నిహితుడని, ఒకప్పుడు తమ విద్యానికేతన్‌, కళాశాల గొప్పదని ఆయనే అంటే పొంగిపోయానని అన్నారు. విద్యాభివృద్ధికి తమ వంతు సహకారం ఇస్తామని ఆ సందర్భంలో హామీ ఇచ్చినా చంద్రబాబు మాటనిలబెట్టుకోలేకపోయారని విమర్శించారు. "నోటితో పొగిడి నొసటితో వెక్కిరించినట్టు" అమలు కాని హామీలు ఎందుకు ఇవ్వాలన్నారు.

రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ఏపీ ప్రభుత్వం సరిగా పనిచేయడం లేదని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల చేయాలని నేరుగా చంద్రబాబుకు లేఖ రాసినా స్పందించలేదన్నారు. తాను ఏ పార్టీకీ చెందిన వ్యక్తిని కాదని, తక్షణం తమ ఆవేదనను అర్థం చేసుకుని ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల చేయాలని కోరారు.