లాహోర్, మార్చ్ 2: పాక్ ఆధీనంలో ఉన్న భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ను పాక్ ఆర్మీ శుక్రవారం రాత్రి భారత ఆర్మీకి అప్పగించారు. అయితే అదే సమయంలో పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కూడా లాహోర్లోనే ఉన్నట్లు సమాచారం. నిన్న సాయంత్రం లాహోర్కు చేరుకున్న ఇమ్రాన్ అభినందన్ అప్పగింత వ్యవహారంపై అధికారులతో సమీక్షించినట్లు తెలుస్తోంది. ఇమ్రాన్ లాహోర్లో ఉండటం వెనక ప్రధాన కారణం.. అభినందన్ అప్పగింత వ్యవహారంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగేలా చూడడమే. అభినందన్ను భారత్కు అప్పగించేంత వరకూ ఇమ్రాన్ లాహోర్లో ఉన్నారు. అనంతరం ఆయన ఇస్లామాబాద్ తిరిగి వెళ్లారు అని ఓ అధికారి వెల్లడించారు. లాహోర్లో ఉన్న సమయంలో ఇమ్రాన్ పంజాబ్ ముఖ్యమంత్రి ఉస్మాన్ బుజ్దార్, గవర్నర్ చౌదరీ సర్వార్తో భేటీ అయిన్నట్లు ఆ అధికారి తెలిపారు.