హైదరాబాద్, ఆగష్ట్ 5: గత కొద్దిరోజులుగా సిటీ మొత్తం మీద ఏదో ఒక అలజడి చెలరేగుతూనే ఉంది. తాజాగా ఈ ఉదయం హైదరాబాద్ పాతబస్తీ శివారు ప్రాంతాలైన అసద్ బాబానగర్, కిషన్ బాగ్ ప్రాంతాలలో దక్షిణ మండలం పోలీసులు కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. పాత నేరస్థులు ఈ ప్రాంతాలలో సంచరిస్తున్నారన్న సమాచారంతో 250 మంది పోలీసులు తెల్లవారు జాము 5 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు ఈ ప్రాంతాలలో సోదాలు చేపట్టారు. ఈ తనిఖీలలో 84 మందిని అదుపులోకి తీసుకుని వారి నుంచి 56 చోరీ వాహనాలను స్వాధీనపరచుకున్నట్లు తెలిసింది. అలాగే తనిఖీల సమయంలో కొన్ని ఇళ్లల్లో యాసిడ్, కుళ్లిన బంగాళదుంపలతో తయారుచేసిన కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్టు డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. హానికరమైన రసాయనాలతో తయారుచేస్తున్న కల్తీ మెహందీ ప్యాకెట్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సెర్చ్లో అదుపులోకి తీసుకున్న 84 మందిలో 20 మంది రౌడీ షీటర్లు, 23 మంది పాత నేరస్థులు ఉన్నారని పోలీసులు అధికారులు తెలిపారు.