అల్లరిమూక చేసిన పనివల్లే అభినందన్ బయటపడ్డాడు

SMTV Desk 2019-03-02 12:08:05  Abhinandan, JL Bhargava, India, Pakistan

న్యూడిల్లీ, మార్చి 02: వింగ్‌ కమాండర్ అభినందన్‌ వర్థమాన్‌ తిరిగి భారత్ చేరుకోవడంపై ఐఏఎఫ్‌ మాజీ అధికారి, రిటైర్డు ఎయిర్‌ కమోడోర్‌ జె.ఎల్‌.భార్గవ హర్షం వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభినందన్ చాలా అదృష్టవంతుడని, ఆయనను కొట్టిన అల్లరి మూకలే దాన్ని వీడియో తీసీ సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో అతను సురక్షితంగా బయటపడ్డాడని అన్నారు. సాధారణంగా పాకిస్థాన్‌కు యుద్ధఖైదీగా చిక్కిన వారి వివరాలు వెలుగు చూడడానికే నెలలూ, సంవత్సరాలు పడుతుంది. కానీ అభినందన్‌ పాక్‌కు చిక్కిన 24 గంటల్లోనే విషయం వెలుగులోకి వచ్చింది. అల్లరి మూకలు కొట్టడం, పాకిస్థాన్‌ సైన్యం అతన్ని అదుపులోకి తీసుకుని తీసుకువెళ్లడం వంటి వీడియోలు వైరల్‌ అయ్యాయి. దీంతో అతని విషయం ప్రపంచానికి తెలిసింది. లేదంటే 1971 నాటి యుద్ధంలో అదృశ్యమైన 54 మంది సైనికుల జాబితాలోనే అభినందన్‌ కూడా చేరిపోయేవాడు. ఆ వీడియో బైటికి రావడం వల్ల పాకిస్తాన్ పై ఒత్తిడి పెరగడంతో మూడు రోజుల్లోనే అతన్ని వదిలేసింది. "నిజంగా ఇదో అద్భుతం. అభినందన్‌ పాకిస్థాన్‌ భూభాగంలో చిక్కుకున్న వెంటనే ఎదురైన అనుభవాల వీడియోలే ఆయనను కాపాడాయి" అంటున్నారు జె.ఎల్‌.భార్గవ.

జె.ఎల్‌.భార్గవ 1971లో ఇండో- పాక్ యుద్ధ సమయంలో పాక్ సైన్యానికి చిక్కాడు. దాదాపు ఏడాది తర్వాత భారత్‌ దౌత్యచర్యల మేరకు ఆయన విడుదలయ్యారు. భార్గవ పాకిస్థాన్‌కు చిక్కినట్టు భారత్‌కు సమాచారం అందడానికే నెలరోజు పట్టింది. కానీ అభినందన్‌ విడుదల రోజుల్లో జరగడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అభినందన్‌ విడుదలైన నేపథ్యంలో ఆయన విడుదల, ఆనాటి తన అనుభవాలను పంచుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...యుద్ధ సమయంలో తప్పని పరిస్థితుల్లో పారాచ్యూట్‌ సాయంతో దిగిన పైలట్‌కు సమస్య ఎదురయ్యేది మొదట అల్లరి మూకల నుంచే. తమ ప్రాంతంలో దిగిన వారిని వారు శత్రుదేశానికి చెందిన వారిగానే అనుమానిస్తారు. 1965 యుద్ధ సమయంలో నా సహచర పైలట్‌ ఫ్లైట్‌ లెఫ్టినెంట్‌ హుస్సేన్‌ పంజాబ్‌లో పనిచేసే వాడు. అతని యుద్ధ విమానం భారత్‌లోనే కూలిపోయింది. పారాచ్యూట్‌ సాయంతో భారత్‌ భూబాగంలోనే అతను దిగాడు. కానీ హుస్సేన్‌ని పాకిస్థానీ అనుకుని అక్కడి అల్లరి మూకలు తీవ్రంగా కొట్టారు. దీంతో అతను ప్రాణాపాయ స్థితికి వెళ్లిపోయాడు. కొట్టిన వారే చివరికి రక్తదానం చేసి హుస్సేన్‌ ప్రాణాలు కాపాడారు. అభినందన్‌ని కూడా అల్లరి మూకలు అలాగే కొట్టాయి. సాంకేతిక పరిజ్ఞానం పెరగడం వల్ల ఉత్సాహంతో ఆ వీడియోను పోస్టు చేశారు. అదే అభినందన్‌కు వరంగా మారింది అని భార్గవ తెలిపారు.