దుబాయ్, ఆగష్ట్ 4: ప్రస్తుతం చిన్న వయస్సులోనే మధుమేహం, స్థూలకాయం (ఒబేసిటీ) లాంటి దీర్ఘకాల వ్యాధులకు బాలలు గురి అవుతున్న విషయం తెలిసిందే. ఈ సమస్యపై దుబాయ్ ప్రభుత్వం కాస్త ముందడుగు వేసి సమస్య మూలాలను కనిపెట్టడంతో పాటు తమ దేశ భవిష్యత్ తరాలను కాపాడే పనిలో నిమగ్నమైంది. వివరాల్లోకి వెళ్తే దుబాయ్లో చాలామంది పిల్లలు స్థూలకాయంతో బాధపడుతున్నారు. పిల్లల్లో స్థూలకాయానికి కారణం గుర్తించింది. రోజులోని మూడు పూటల్లో రెండు పూటలు స్కూల్లోనే భోజనం చేసే బాలల్లో ఈ సమస్యను నివారించేందుకు సన్నద్ధమైంది. ఇందులో భాగంగా 11 రకాల ఆహార పదార్థాలు స్కూళ్లలో అందుబాటులో ఉంచకూడదని ఉత్తర్వులు జారీ చేసింది. చూయింగ్ గమ్, కాండీస్, అన్ని రకాల పండ్ల రసాలు, ఎనర్జీ డ్రింక్స్, అధిక చక్కెరను కలిగిన రంగు రంగుల స్వీట్లు, ప్లెయిన్ చాక్లెట్, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు, సాఫ్ట్ డ్రింక్ లు, చిప్స్, కృత్రిమ పద్ధతుల్లో తయారు చేసే పాలు, పెరుగు, బోఫక్ (స్పెషల్ చిప్స్) లాంటి ఆహార పదార్ధాలను స్కూల్ పరిసరాలలో నిషేధిస్తూ ఆదేశాలు వెల్లడించింది. ఈవిధంగా పిల్లల ఆరోగ్యాన్ని కాపాడనుంది.