హైదరాబాద్, మార్చి 2: గ్రామ రెవెన్యూ అధికారుల(వీఆర్వో) పోస్టుల తుది ఫలితాలను టీఎస్పీఎస్సీ శుక్రవారం ప్రకటించింది. గత ఏడాది సెప్టెంబర్ నెలలో టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో మొత్తం 700 పోస్టులకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా డిసెంబర్లోనే రాతపరీక్ష ఫలితాలను ప్రకటించగా, శుక్రవారం నాడు ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.
మొత్తం 700 పోస్టులకు నోటీసులు విడుదల చేయగా అందులో 697 ఖాళీలు భర్తీ అయ్యాయి. హైకోర్టు కేసుల కారణంగా రెండు పెండింగ్లో ఉన్నాయి. మరో పోస్టుకు సంబంధించి అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. www.tspsc.gov.in వెబ్సైట్ ద్వారా అభ్యర్థులు ఫలితాలు తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.