చెన్నై, మార్చి 02: మానసిక రోగులు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో ఎవరూ చెప్పలేరు. ఒక్కోసారి వారు చేసే పనులు వారి ప్రాణాలకే ముప్పును తెచ్చిపెడతాయి. తాజాగా ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే మానసిక రోగి జయకుమార్ (54) ఐనావరం మెంటల్ హాస్పిటల్లో ఉండగా ఎంఆర్ఐ స్కాన్ తీసేందుకు వైద్యులు ప్రయత్నించారు.
అయితే స్కాన్ తీయడంలో సమస్యలు ఏర్పడ్డాయి. అతని కడుపులో ఏవైనా లోహపు వస్తువులు ఉండొచ్చని వైద్యులు అనుమానించారు. దీంతో చెన్నై రాజీవ్గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చి అక్కడ సీటీ స్కాన్ చేశారు. ఈ స్కాన్లో అతని కడుపులో తాళం చెవులు, నాణేలను ఉండటాన్ని గమనించారు.
గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు ఆ సామాన్లను బయటికి తీయడానికి తీవ్రంగా శ్రమించారు. ప్రత్యేక పరికరాన్ని కడుపులోకి చొప్పించి వాటిని వెలికి తీశారు. దీని గురించి ఆస్పత్రి డీన్ జయంతి శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ రోగి కడుపులో ఆపరేషన్ లేకుండా వస్తువులను వెలికితీశామని అన్నారు. ప్రస్తుతం రోగి జయకుమార్ ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. అతని కడుపులో ఉన్న అన్ని వస్తువులను వెలికితీసినట్లు బ్లూరోస్కోపీ ద్వారా నిర్ధారించామన్నారు.