హైదరాబాద్, మార్చి 02: ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం యాత్ర . ఈ సినిమాకి మహి వి రాఘవ దర్శకత్వం వహించాడు. ఇప్పుడు ఈ దర్శకుడు నిర్మాతగా మారనున్నాడు. తన సన్నిహితులైన శివమేక, రాకేష్ మంహకాళి తో కలిసి త్రీ ఆటమన్ లీవ్స్ పేరిట ఓ ప్రొడక్షన్ హౌస్ ని స్థాపించారు.
సంప్రదాయ తెలుగు సినిమా ప్రొడక్షన్ సంస్థల మాదిరిగా సినిమాల్ని నిర్మించి, విడుదల చేసే పద్ధతికి పూర్తి భిన్నంగా త్రీ ఆటమన్ లీవ్స్ సంస్థ అడుగులు వేస్తోంది. నూతన దర్శకులు,కథా రచయితలను ప్రోత్సహిస్తూ వారి చేత కొత్త కొత్త కథల్ని తయారుచేయించడం త్రీ ఆటమన్ లీవ్స్ సంస్థ ముఖ్య ఉద్దేశం. ఇలా తయారయిన కథలని పలు నిర్మాణ సంస్థలతో కలిసి నిర్మించేందుకు త్రీ ఆటమన్ లీవ్స్ సంస్థ కృషిచేస్తుందని మహి వి రాఘవ తెలిపారు.
యాత్ర చిత్రానికి త్రీ ఆటమన్ లీవ్స్ సంస్థ సహా నిర్మాతగా వ్యవహరించింది. ఆ చిత్రంలో కథను తెలుగు ప్రేక్షకుల నేటివిటీని పరిగణలోకి తీసుకునే త్రీ ఆటమన్ లీవ్స్ ద్వారా కథల్ని ముందుగా కాగితాల పై నిర్మించి ఆ తరువాత పలు నిర్మాణ సంస్థలతో కలిసి తెర పై నిర్మించే నిర్ణయానికి వచ్చినట్లుగా దర్శకుడు మహి, నిర్మాతలు శివ మేక, రాకేష్ మహంకాళి తెలిపారు.
త్రీ ఆటమన్ లీవ్స్ సంస్థ ప్రస్తుతం ఔత్సాహికులైన రచయితల్ని, కొత్త కథల్ని ప్రొత్సహించే నిర్మాణ సంస్థలతో భాగస్వాములు అయ్యేందుకు ముందుంటుందని, అలానే కేవలం సినిమాలనే కాకుండా వెబ్ సిరీస్ లు, డాక్యుమెంటరీలకి సంబంధించిన రచయితలు, ఫిల్మ్ మేకర్స్, నిర్మాణ సంస్థలు, ఛానల్ పార్టనర్స్ తో జతకలిసేందుకు త్రీ ఆటమన్ లీవ్స్ సంస్థ సముఖంగా ఉందని మహి వి రాఘవ్ తెలిపారు.