హైదరాబాద్, మార్చి 01: మొదటి సినిమా ఆర్ఎక్స్ 100 తో భారీ విజయం సాధించిన హీరో కార్తికేయ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. కార్తికేయ హీరోగా అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతుంది. అనిల్ కడియాల, తిరుమల రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా తొలి షెడ్యూల్ ఒంగోలులో జరిగింది. ఈ భారీ షెడ్యూల్తో 40 శాతం చిత్రీకరణ పూర్తయింది.
ఈ సందర్భంగా హీరో కార్తికేయ మాట్లాడుతూ.. "కొన్ని కథలు వినగానే నచ్చుతాయి. మళ్లీ మళ్లీ గుర్తుకొస్తుంటాయి. నలుగురితో పంచుకోవాలనిపిస్తుంటాయి. నాకు అర్జున్ జంధ్యాల చెప్పిన కథ అలాంటిదే. వినగానే నచ్చింది. బెస్ట్ స్టోరీ టు టెల్ అనిపించింది. ఇటీవల ఒంగోలులో భారీ షెడ్యూల్ చేశాం. ప్రతి ఫ్రేమూ రియలిస్టిక్గా వచ్చింది" అని అన్నారు. ఆపై దర్శకుడు అర్జున్ జంధ్యాల మాట్లాడుతూ... "రియలిస్టిక్ చిత్రమిది. వాస్తవ ఘటనలనుంచి స్ఫూర్తి పొంది రాసకున్న కథ. ఎంతోమంది మనసులకు దగ్గరగా ఉంటుంది. హీరో పాత్ర యువతకు రెప్రజంటేషన్లాగా ఉంటుంది. అన్నీరకాల భావోద్వేగాలుంటాయి. అన్నీ అంశాలూ మిళితమైన సబ్జెక్ట్ గా రూపొందించాం. అందరూ చూడదగ్గ చిత్రమవుతుంది. రియలిస్టిక్ యాక్షన్ అండ్ లవ్ ఎంటర్టైనర్ ఇది" అని తెలిపారు.
నిర్మాతలు అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి మాట్లాడుతూ... "తొలి షెడ్యూల్ ఒంగోలులో చేశాం. దాదాపు 25 రోజులు అక్కడి క్వారీలు, గ్రానైట్ ఫ్యాక్టరీలు, కాలనీలు, రిజర్వాయర్లలో షూటింగ్ చేశాం. కీలకమైన టాకీ పోర్షన్, ఒక పాట, కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరణ పూర్తయింది. దీంతో దాదాపుగా 40 శాతం షూటింగ్ ముగిసింది. మార్చి 5 నుంచి యూరప్లోని క్రొయోషియాలో రెండు పాటలను తెరకెక్కిస్తాం" అని అన్నారు. చైతన్య భరద్వాజ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.