విజయవాడ, ఫిబ్రవరి 28: విజయవాడలో ఈ రోజు నిర్వహించిన ఏపీ రేషన్ డీలర్ల ఆత్మీయ సదస్సుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మన హక్కులను కాలరాసిన ప్రధాని మోదీ మన రాష్ట్రంలో పర్యటించడానికి వీలులేదని అన్నారు. ఏపీకి మోదీ రాకను నిరసిస్తూ ఈరోజు సాయంత్రం కాగడాల ప్రదర్శనలు, బైక్ ర్యాలీలు నిర్వహించాలని, రేపు నల్ల జెండాలు, నల్ల బెలూన్లు, నల్ల చొక్కాలు ధరించి నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని తమ నేతలకు పిలుపు నిచ్చారు. మోదీ ఏపీకి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాకే ఈ రాష్ట్రంలో అడుగుపెట్టాలని చంద్రబాబు అన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ మరోసారి విజయం సాధించి మళ్లీ అధికారంలోకి రావడం చారిత్రక అవసరంగా గుర్తించాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. ఏపీకి మోదీ ఎప్పుడొచ్చినా అది చీకటి రోజేనని ఆయన విరుచుకుపడ్డారు.