న్యూఢిల్లీ, జూన్ 1 : ప్రభుత్వరంగ సంస్థల పనితీరు ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు..సంక్షేమం, రాబడి రెండు మార్గాలలో ప్రయాణిస్తు ఏ దరి చేరవనేది సుస్పష్టమే. వేరసి నష్టాలు..అప్పులు సర్వసాధారణం. ఆ తరువాత నష్టాలంటూ సంస్థలను మూసివేయడమో లేదా ప్రైవేటికరించమో పరిపాటి. పెట్టుబడుల ఉపసంహరణ గురించి తెలియంది కాదు. ప్రస్తుతం అన్ని ప్రభుత్వరంగ సంస్థల మాదిరి ఎయిరిండియా సైతం ప్రైవేటీకరణ మార్గంలో ప్రయాణించనుంది. ఈ అంశంపై కేంద్ర కేబినెట్ త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడవుతున్నది. యుపిఎ హయంలో అందిన 38 వేల కోట్ల ఆర్థిక సహాయం ప్యాకేజీతో ఎయిరిండియా నెట్టుకొస్తోంది. గట్టి పోటీని ఎదుర్కొంటూ ఆర్థిక స్థితిని మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఎయిరిండియా నిర్వహాణ కోసమై భారీగా ప్రజాధనాన్ని కేటాయిస్తున్నామని, ఆ సోమ్మును దేశంలో విద్య, వైద్యం కోసం వినియోగించవచ్చని నీతి ఆయోగ్ గతంలో సూచించింది. మార్కెట్ లో ఎయిరిండియా వాటా 14 శాతం కాగా, రుణభారం మాత్రం 50 వేల కోట్లు గా ఉందని, సంస్థలో పెట్టుబడుల ఉపసంహరణ చేపట్టాల్సి ఉందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించిన నేపధ్యంలో ప్రైవేటీకరణ బాట తప్పదని స్పష్టం అవుతున్నది.