హన్మకొండ, ఫిబ్రవరి 28: బుదవారం నుండి రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల్లో ఓ విద్యార్థిని కాపీ కొడుతూ దొరికిపోవడంతో...మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ కిషన్ పురంలో చోటుచేసుకుంది. పూర్తి వివారాల ప్రకారం...కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం నాగారం గ్రామానికి చెందిన కొలసాని వెంకటరావు కూతురు రక్షారావు హన్మకొండలోని ఎస్ఆర్ కళాశాలలో బైపీసీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఈ కళాశాలకు సంబంధించి పరీక్ష కేంద్రం హన్మకొండ కిషన్పురంలోని ఆర్డీ కళాశాలలో పడింది. భవనం మూడో అంతస్తులో మొదటి పేపర్ సంస్కృతం పరీక్ష రాయడానికి వచ్చిన రక్షారావు.. కాపీయింగ్ చేస్తుండగా ఇన్విజిలేటర్ పట్టుకుని చీఫ్ సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లారు. ఎందుకు కాపీ చేస్తున్నావంటూ వారు ప్రశ్నిస్తుండగానే ఆందోళనకు గురైన రక్షారావు ఒక్కసారిగా భవనం నుంచి కిందకు దూకడంతో రెండు కాళ్లు విరిగిపోయి తీవ్ర గాయాలయ్యాయి. కళాశాల నిర్వాహకులు వెంటనే ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.