వేసవిలో బీర్లు బంద్...మద్యం ప్రియుల ఆందోళనలు

SMTV Desk 2019-02-28 17:05:18  Beers, Beers banned in summer

హైదరాబాద్, ఫిబ్రవరి 28: ఇంకా వేసవి కాలం రానేలేదు కాని ఎండలు మాత్రం తీవ్రంగా మండిపోతున్నాయి. ఇప్పుడే ఈ రేంజ్ లో ఉంటె ఇంకా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో బయట వివిధ రకాల పనులు పూర్తి చేసుకొని ఇంటిదారి పట్టే వారు వారిలో ఎక్కువగా ఓ చల్లని బీర్లు తాగి ఉపసమనం పొందాలని భావిస్తారు. బీర్లు అన్ని కాలాలతో పోలిస్తే వేసవిలో కాస్త ఎక్కువగా అమ్ముడు పోతాయి కూడా. అయితే వీటి సరఫరా నిలిపివేస్తూ రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. బీరు తాగకండి.. కావాలంటే లిక్కర్ తాగండి అంటూ హుకుం జారీ చేసినట్టు తెలుస్తుంది. దేశంలో బీర్ల విక్రయాలు ఎక్కువగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంటాయి. ఇక్కడ చాలామంది మద్యం ప్రియులు బీరే ఎక్కువగా ఇష్టపడతారు. కానీ ఎక్సైజ్‌ శాఖ ఈ బీరు విక్రయాలకు అడ్డుకట్ట వేస్తూ మద్యం అమ్మకాలను పెంచాలని యోచిస్తోంది. బీరుపై ఎక్సైజ్‌ డ్యూటీ తక్కువగా ఉండగా, మద్యంపై ఎక్కువగా ఉంది. అందుకే మద్యాన్ని విక్రయిస్తే ఖజానాకు ఎక్కువ రాబడి వస్తుందన్నది ఎక్సైజ్‌ శాఖ ఉద్దేశం. ఎక్సైజ్‌ శాఖ తీసుకొనున్న ఈ నిబంధనలతో వైన్‌ షాపులు, బార్ల యజమానులు ఆందోళనకు గురవుతున్నారు. లైసెన్సు ఫీజు రూపంలో లక్షలాది రూపాయలు చెల్లిస్తుంటే తమపై లేనీ పోనీ నిబంధనలు పెడుతూ నష్టాలకు కారణమవుతున్నారంటూ ఆరోపిస్తున్నారు. బుధవారం ఎక్సైజ్‌ శాఖ ఉన్నతాధికారుల నుంచి అన్ని మద్యం డిపోలకు మౌఖిక ఆదేశాలు వెళ్లాయి. వైన్‌ షాపులు, బార్లు, క్లబ్బులవారికి బీరు విక్రయించరాదని, కేవలం మద్యం మాత్రమే సరఫరా చేయాలన్నది ఆ ఆదేశాల సారాంశం. దీంతో రాష్ట్రంలోని 19 డిపోల మేనేజర్లు బుధవారం ఎవరికీ బీరును సరఫరా చేయలేదు. కేవలం మద్యంను లిఫ్ట్‌ చేయాలనుకున్న వారికి మాత్రమే సరఫరా చేశారు. ఒక్క బీరు సీసా కూడా డిపోల నుంచి బయటకు రాలేదు. అదేమని అడిగితే ఉన్నతాధికారుల ఆదేశాలంటూ డిపో మేనేజర్లు సమాధానమిచ్చారని వైన్‌ షాపుల యజమానులు వెల్లడించారు.