జవాన్ చనిపోయిన 13 రోజులకే మరిదిని పెళ్లి చేసుకోవలంటున్న అత్త మామలు

SMTV Desk 2019-02-28 13:33:31  mandya, crpf jawan, jawan wife, indian army

మాండ్యా, ఫిబ్రవరి 28: పుల్వామా దాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్ల మరణం ఇంకా యావత్ భారత దేశాన్ని కలచి వేస్తుంది. ప్రతి దాడి ని చేసేవరకు భారత్ నిద్రపోలేదు. కాని కర్ణాటకకి చెందిన ఓ కుటుంబం మాత్రం ప్రభుత్వం ఇచ్చే ప్రయోజనాల కోసం జవాన్ చావుని కూడా తమకి అనుకూలమైన పద్ధతిలో మలుచుకునేందుకు పన్నాగం వేసారు.

ఓ సీఆర్పీఎఫ్ జవాన్ చనిపోయిన 13 రోజులకే అతని భార్యకు అత్తవారింట్లో వేధింపులు మొదలయ్యాయి. ప్రభుత్వం ఇవ్వబోయే భారీ నష్టపరిహారం సొంతం చేసుకోవడం కోసం ఆమెను సొంత మరిదికి ఇచ్చి వివాహం చేసేందుకు అత్తామామలు సిద్ధమయ్యారు.

ఈ పెళ్లికి ఒప్పుకోవాలని ఆమెపై తీవ్రంగా ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. చివరికి ఈ వేధింపులు హద్దు దాటడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన కర్ణాటకలోని మాండ్యాలో చోటుచేసుకుంది.

మాండ్యాకు చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ హెచ్. గురు ఇటీవల పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో అమరుడయ్యారు. ఈ ఘటన అనంతరం పలువురు వ్యక్తులు సీఆర్పీఎఫ్ జవాన్లకు సాయం ప్రకటించారు. అంతేకాకుండా ప్రభుత్వం నుంచి కూడా ఆర్థిక సాయం అందనుంది. ఈ నేపథ్యంలో ఆ మొత్తం నగదు దక్కించుకునేందుకు వీలుగా గురు కుటుంబ సభ్యులు పావులు కదిపారు.

మరిదిని పెళ్లి చేసుకోవాలని గురు భార్య కళావతి(25)పై ఒత్తిడి తీసుకొచ్చారు. చివరికి వేధింపులు హద్దుదాటడంతో ఆమె మాండ్యా పోలీసులను ఆశ్రయించారు. మరోవైపు కళావతికి ఉద్యోగం కల్పించాలని సంబంధిత అధికారులను కర్ణాటక సీఎం కుమారస్వామి ఆదేశించారు.