హైదరాబాద్, ఆగష్టు 4 : తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ కు సినీ హీరోయిన్ లను పరామర్శించే సమయం ఉంటుంది కాని, నేరేళ్ల బాధితులను పరామర్శించడానికి మాత్రం సమయం లేదా? అంటూ టీడీపీ నేత రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఈ రోజు ఆయన కరీంనగర్ లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. కోట్ల రూపాయలను కొల్లగొట్టేందుకు ఆయన బంధువులకే ఇసుక కాంట్రాక్ట్ లు ఇచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. తన ఆరోపణలే కనుక తప్పయితే తనపై కేసులు పెట్టాలని ఆరోపించారు. నేరేళ్ల బాధితులపై అక్రమకేసులను పెట్టడమే కాక వారిని చిత్రహింసలకు గురిచేసే అధికారం ఆ జిల్లా ఎస్పీకి ఎవరు ఇచ్చారంటూ మండిపడ్డారు. అసలు ఇసుకతో వెయ్యి కోట్ల ఆదాయం వస్తే, బాధిత కుటుంబాలకు ఎందుకు సాయం చేయరంటూ ప్రశ్నించారు. కేటీఆర్ కనుక ఈ ఆగష్టు 15 లోపు నేరేళ్ల బాధితులను పరామర్శించి వారిని ఆదుకోకపోతే నేరేళ్లను ముట్టడించి సంగతి తేలుస్తామంటూ రేవంత్ రెడ్డి హెచ్చరించారు.