ఫిబ్రవరి 28: జనసేన అధ్యక్షుడు, సినీ హీరో పవన్ కల్యాణ్ మాజీ భార్య, సినీ నటి రేణు దేశాయ్ ఇటీవల కర్నూల్ జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో పవన్ కూడా కర్నూల్ జిల్లా పర్యటనలో ఉండటం కూడా విదితమే. ఈ పర్యటన సందర్భంగా రేణు దేశాయ్ సాక్షి టీవీ రిపోర్టర్ అవతారం ఎత్తడం జనాల్లో పలు అనుమానాలను రేకెత్తించింది. పవన్ కు వ్యతిరేకంగా రేణును వైసీపీ రంగంలోకి దించిందనే కథనాలు కూడా వినవచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ వార్తలన్నింటికీ ఖండిస్తూ రేణు సమాధానమిచ్చారు. రైతుల జీవితాలను, వారి కష్టాలను వెలుగులోకి తెచ్చేందుకే తాను సాక్షి టీవీ తరపున రిపోర్టర్ గా వ్యవహరించానని రేణు తెలిపారు. రైతులకు సంబంధించిన ఒక టీవీ కార్యక్రమాన్ని తాను చేస్తున్నానని చెప్పారు. రైతుల కోసం తాను చేస్తున్న పనిని రాజకీయాలతో ముడిపెట్టవద్దని విన్నవించారు. ఇప్పటి వరకు తాను 200 మంది రైతులను కలిశానని, వారి జీవితాలు దుర్భరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు సహకారం అందించేలా ప్రజలను చైతన్యపరచాల్సిన అవసరం ఉందని చెప్పారు. తన వల్ల ఒక్క రైతు జీవితం బాగుపడినా తాను చాలా సంతోషిస్తానని అన్నారు.