కర్ణాటక, ఫిబ్రవరి 28: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ చీఫ్ బీఎస్ యడ్యూరప్ప మరోసారి వివాదాన్ని కొని తెచ్చుకున్నారు. భారత్, పాక్ ల మధ్య ఉద్రిక్తతలు పెరిగి, యుద్ధ వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో, ఎన్ని విమానాలు పాక్ లోకి వెళితే, అన్ని ఎక్కువ స్థానాలను బీజేపీ గెలుచుకుంటుందని ఆయన అనడం విమర్శలకు దారితీసింది. చిత్రదుర్గలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన త్వరలో జరిగే లోక్ సభ ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీ 28 వరకూ సీట్లను గెలుచుకుంటుందంటు వ్యాఖ్యానించారు. "వాతావరణం రోజురోజుకూ మారిపోతోంది. అది బీజేపీకి అనుకూలంగా మారుతోంది. ఉగ్రవాదుల స్థావరాలపై భారత విమానాలు దాడి చేసిన తరువాత దేశవ్యాప్తంగా గాలులన్నీ నరేంద్ర మోదీకి అనుకూలంగా వీస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో అధిక సీట్లు మనకే వస్తాయి. యువత మొత్తం పార్టీ వెంట ఉంది" అని ఆయన వ్యాఖ్యానించారు. యడ్యూరప్ప వ్యాఖ్యలపై కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తూ, సైన్యం త్యాగాలను బీజేపీ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తోందని ఆరోపించింది.