నంద్యాల, ఆగష్టు 4: 2019 సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా నంద్యాల ఉపఎన్నికలను ఇటు అధికార పక్షం, అటు ప్రతిపక్షం ఎంతో కీలకంగా భావిస్తున్నాయి. అయితే నిన్న నంద్యాలలో వైసీపీ బహిరంగ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సభలో శిల్పా సోదరులు భూమా అఖిలప్రియ, భూమా బ్రహ్మనంద రెడ్డిపై చేసిన విమర్శలను మంత్రి అఖిలప్రియ తనదైన శైలిలో తిప్పి కొట్టారు. ప్రతిపక్ష నాయకుడు జగన్ ఓట్ల కోసం వైయస్ ఫొటో పెట్టుకుని వస్తున్నప్పుడు, మేము మా తల్లిదండ్రుల ఫొటోను పెట్టుకోవడం తప్పా అని ప్రశ్నించారు. తన తల్లి శోభా నాగిరెడ్డి జగన్ సోదరి షర్మిల కోసం వెళ్లి, తిరిగి వస్తున్నప్పుడే దుర్మరణం చెందారని, షర్మిల కోసమే తన తల్లి చనిపోయిందన్న విషయాన్ని జగన్ ఎలా మర్చిపోయారో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.