లక్నో, ఆగష్టు 4 : రక్షా బంధన్ సందర్భంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తొలిసారి మహిళల కోసం వినూత్న ఆఫర్ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఒక రోజంతా ఉచితంగా అన్ని నాన్ ఏసీ బస్సులలో 6వ తేదీ అర్థరాత్రి నుంచి 7వ తేదీ అర్థరాత్రి వరకు ప్రయాణించవచ్చని ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ స్వయంగా ప్రకటించారు. యూపీఎస్ ఆర్టీసీ నూతనంగా నిర్మించడానికి తలపెట్టిన పలు ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు. అంతేకాక లక్నో, ఆగ్రా, కాన్పూర్, వారణాసి, అలహాబాద్, మొరదాబాద్, బరేలి, గోరఖ్పూర్, అలీఘర్ తో పాటు మొత్తం 66 జిల్లాల్లోని 75 బస్ స్టేషన్లలో ఉచిత వైఫై అందుబాటులోకి తీసుకొచ్చింది. బస్ టికెట్ తీసుకున్న ప్రయాణికులు వైఫై పాస్వర్డ్ అడిగి నేరుగా యాక్సెస్ అయ్యేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే ఈ ఉచిత వైఫై సౌకర్యం ఎంతకాలం ఉచితం అనేది మాత్రం తెలియ రాలేదు.