న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: భారత్-పాక్ ల మధ్య ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. ఇరు దేశాలు ఒకరి యుద్ధ విమానాన్ని మరొకరు కూల్చేశారు. మరోవైపు, నేషనల్ యూత్ ఫెస్టివల్ 2019 కార్యక్రమానికి హాజరైన మోదీ... విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా... ప్రధాని కార్యాలయానికి చెందిన ఒక అధికారి ఆయనకు ఒక చిన్న పేపర్ ను అందించారు. దీంతో, ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి, వేదిక దిగి వెళ్లిపోయారు.
భారత భూభాగంలోకి పాక్ యుద్ధ విమానాలు చొచ్చుకురావడంతో మోదీ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సరిహద్దుల్లో భద్రతాదళాలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాలని అధికారులను మోదీ ఆదేశించారు.