అమరావతి, ఫిబ్రవరి 27: వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ ఉదయం గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మించుకున్న కొత్త ఇంటిలోకి గృహ ప్రవేశం చేసారు. సర్వమత ప్రార్థనల మధ్య ఉదయం వైఎస్ జగన్, భారతి దంపతులు కొత్తింట్లోకి అడుగుపెట్టారు. ఈ కార్యక్రమానికి జగన్ తల్లి వైఎస్ విజయలక్ష్మీ, సోదరి షర్మిల, అనిల్ దంపతులు, వైసీపీ కీలకనేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, తలశిల రఘురాం తదితరులు పాల్గొన్నారు.
ఈ గృహ ప్రవేశం పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. ఈరోజు ఉదయం టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు జగన్ కు లోటస్ పాండ్ లో ఒక ప్యాలెస్, బెంగుళూరులో మరో ప్యాలస్, పులివెందులలో ఇంకో ప్యాలెస్ ఉన్నాయని... ఇప్పుడు తాడేపల్లిలో మరో ప్యాలెస్ నిర్మించుకున్నారని... ప్యాలెస్ లేకపోతే జగన్ ఉండలేరని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్కు ప్యాలెస్ల మీద ఉన్న ప్రేమ ప్రజాసేవ పట్ల లేదని విమర్శించారు. తాడేపల్లి ప్యాలెస్ పూర్తయ్యేంత వరకు జగన్ హైదరాబాద్ ను వదిలి రాలేదని అన్నారు. వైసీపీ అనేది పేదల పార్టీ కాదని, ప్యాలెస్ ల పార్టీ అని అన్నారు.