నంద్యాల, ఆగష్టు 3: నంద్యాల సభలో జగన్ తన ప్రసంగాన్ని ముగిస్తూ ఈ ఎన్నికలలో తమ అభ్యర్థిని గెలిపిస్తే నంద్యాలను మోడ్రన్ టౌన్గా అభివృద్ధి చేస్తానని మీకు మాట ఇస్తున్నాను అని ఆయన ప్రకటించారు. 2019 అసెంబ్లీ ఎన్నికలలో మా పార్టీ అధికారంలోకి వస్తే 13 జిల్లాల ఆంధ్రని ప్రతీ పార్లమెంట్ స్థానాన్ని జిల్లాగా మారుస్తామని, నంద్యాలను జిల్లాగా చేస్తామని, ఆ జిల్లాకు ముఖ్యపట్టణంగా నంద్యాలనే ఏర్పాటు చేసి, నంద్యాలలో వ్యవసాయ యూనివర్శిటీ ప్రారంభిస్తానని హామీ ఇచ్చారు. నంద్యాల ప్రజల ఆశీస్సులు రేపటి తమ విజయానికి పునాదులు కావాలని ఆకాంక్షిస్తున్నాను అని తెలిపారు. మా పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే అగ్రిగోల్డ్, కేశవరెడ్డి బాధితులందరికీ న్యాయం చేస్తాం, ఆర్య వైశ్య సోదరులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి సహాయం చేస్తామని ఘంటాపథంగా చెప్తున్నా ను. 2018లో వైసీపీకి వచ్చే ఒకే ఒక్క ఎమ్మెల్సీ సీటును నంద్యాల ముస్లింకు ఇస్తాను అని స్పష్టం చేసారు. నంద్యాల ప్రజలు అభివృద్ధికి పట్టం కడతారని విశ్వసిస్తున్నాను. మన ఎన్నికల గుర్తు అందరికీ తెలుసు కదా అంటూ ప్రసంగాన్ని ముగించారు.