హన్మకొండలో దారుణం

SMTV Desk 2019-02-27 13:34:28  Hanmakonda,

పోలీసులు ఎప్పటికప్పుడు ఎన్ని పటిష్టమైన చర్యలు తీసుకొంటున్నప్పటికీ రాష్ట్రంలో ప్రేమోన్మాదుల అరచాకాలు నానాటికీ పెరిగిపోతూనే ఉన్నాయి. ఆడపిల్లల జీవితాలు అర్దాంతరంగా ముగిసిపోతున్నాయి. వారి కన్నవారికి తీరనిశోకంతో కుమిలిపోతూనే ఉన్నారు.

హైదరాబాద్‌లో ప్రేమోన్మాది చేతిలో తీవ్రంగా గాయపడిన మధులిక సంఘటన ఇంకా కళ్ళలో మెదులుతుండగానే, బుదవారం ఉదయం హన్మకొండ పట్టణంలో నయీమ్ నగర్ కాలనీలో అటువంటిదే మరో దారుణం జరిగింది. స్థానిక వాగ్దేవీ డిగ్రీ కాలేజీలో చదువుతున్న రవళీ అనే ఒక విద్యార్ధినిపై అవినాష్ అనే వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. పోలీసుల సమాచారం ప్రకారం అతను అదే కాలేజీలో చదువుతున్నట్లు తెలుస్తోంది.

చాలారోజులుగా ఆమె వెంటపడుతున్న అవినాష్ ఈరోజు ఉదయం ఆమె కళాశాలకు వెళుతుండగా, బైక్ పై ఎదురుగా వచ్చి వెంటతెచ్చుకొన్న పెట్రోల్ బాటిల్ పైకి తీసి ఆమెపై పోసి నిప్పంటించిపారిపోయాడు. ఇదంతా క్షణంలో జరిగిపోవడంతో ఏమి జరుగుతోందో గ్రహించేలోగానే ఆమె మంటలలో చిక్కుకొంది. అది చూసి అక్కడే ఉన్న ప్రజలు మంటలు ఆర్పి పోలీసులకు సమాచారం అందించడంతో వారు హుటాహుటిన అక్కడకు చేరుకొని ఆమెను అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. ఈ దాడిలో 75 శాతంపైగా కాలిన గాయాలతో ఆమె పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు తాజా సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆ యువకుడికోసం గాలింపు మొదలుపెట్టారు.