హైదరాబాద్, ఫిబ్రవరి 27: తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పై పలువురు పొగడ్తల జల్లు కురిపిస్తున్నారు. కెసిఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు యావత్ దేశానికి ఆదర్శమని కొనియాడుతున్నారు. నల్లగొండ ఎంపీ, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్రెడ్డి, ఈరోజు ఆ జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ......మన ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ దేశమంతా కోరుకుంటుందని అన్నారు.
రైతుబంధు , రైతు భీమా వంటి పథకాలు ఎందరికో ఆసరాగా నిలిచాయని, తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన పథకాలు మన దేశమంతటిని దిశానిర్దేశం చేస్తున్నాయని, మన కేసిఆర్ దేశం మెచ్చిన నాయకుడిగా ఎదిగారని కొనియాడారు. అలాగే, ఎంపీగా నా బాధ్యతలన్నింటిని కూడా ఎంతో బాధ్యతగా నెరవేర్చానని, గడిచిన ఐదేళ్ల కాలం పూర్తి స్థాయిలో ప్రజల కోసమే తన సమయాన్ని కేటాయించినట్టు తెలిపారు.
తన పార్లమెంట్ పరిధిలోనే రెండు మెడికల్ కాలేజీలు, రెండు కేంద్రీయ విద్యాలయాలు సాధించుకోవడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. కేసిఆర్ గారి వల్లే మన రాష్ట్రం ఇంతలా అభివృద్ధిని సొంతం చేసుకుందని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.