అమరావతి, ఫిబ్రవరి 27: గుంటూరు మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు సోమవారం హైదరాబాద్లో మీడియా ముఖంగా మాట్లాడుతూ...... తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లో ఉన్న కూడా ఆంధ్రప్రదేశ్ నేతలను వేధిస్తుందని మండిపడ్డారు.
తెరాస నాయకుల ఒత్తిడి వల్లే ఏపీ నాయకులూ భయబ్రాంతులకు గురై పార్టీ వీడుతున్నారని వెల్లడించారు. అలాగే, తన దగ్గర ఆయన పప్పులేవీ వుడకవని, ఎంతగా ఒత్తిడికి గురిచేసినా పార్టీని వీడేది లేదని స్పష్టం చేశారు. ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వంపై కాని, తెలంగాణ ముఖ్యమంత్రిపై కాని ఎలాంటి విమర్శలు చేయని సాంబశివరావు ఉన్నట్టుండి తెలంగాణ ప్రభుత్వంపై, కేసీఆర్పై సంచలన వ్యాఖ్యలు చేయడం రాజకీయ నాయకులని ఆశ్చర్యానికి గురి చేసింది.
తన కంపెనీకి తెలంగాణ ప్రభుత్వం 300 కోట్లు బాకీ పడిందిని, ఎన్ని సార్లు నోటీసులు పంపిన స్పందన లేదని, ఇక కోర్టులోనే తేల్చుకుంటానని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మోదీ, కేసీఆర్, జగన్ ఈ ముగ్గురు ఏకమై వచ్చినా చంద్రబాబు నాయుడిని ఏమీ చేయలేరని, చంద్రబాబే మరోసారి ఏపీకి ముఖ్యమంత్రి కాబోతున్నారని ఈ సందర్భంగా జోశ్యం చెప్పారు.