న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: భారత సైన్యం మంగళవారం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో దాడులు జరుపగా, పాక్ ప్రభుత్వం ఈ దాడిని ఖండించింది. ప్రతీకారం తీర్చుకుంటామని ఆగ్రహంతో ఉంది. ఈ క్రమంలో జమ్మూ, కశ్మీర్ లోయలోని ప్రజలు ఎప్పుడేం జరుగుతుందోనని భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా చేరి ఈ అంశం గురించే చర్చించుకుంటున్నారు. "ఇది ఇక్కడితో ఆగుతుందని ఆశిస్తున్నా. ఇంకా కొనసాగితే ఇరు దేశాల మధ్య శత్రుత్వం పెరుగుతుంది. దీనివల్ల నియంత్రణ రేఖకు ఇరు వైపులా ఉన్న ప్రజలు తీవ్రంగా బాధపడతారు" అని భారత్, పాక్ మధ్య జరిగిన అన్ని యుద్ధాలను చూసిన 80 ఏళ్ల అబ్దుల్ ఘనీ దార్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం నుంచి వివిధ ప్రాంతాల నుండి వస్తున్న బుకింగ్స్ను చాలా హోటళ్లు రద్దు చేస్తున్నాయని యజమానులు చెబుతున్నారు.