హైదరాబాద్, ఆగస్టు 3 : ప్రజల తిరస్కారానికి గురైనా కాంగ్రెస్, కేసులతో అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. అభివృద్ధి జరిగితే తమకు పుట్టగతులు ఉండవనే ఉద్దేశంతో కుట్రలకు పాల్పడుతున్నారన్నారు. ప్రభుత్వం జివో తీసుకువస్తే చాలు కేసులతో అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ పొరుగు సేవల కార్మికులను క్రమబద్ధీకరించలేదని విలీనం చేశానని ఆయన స్పష్టం చేశారు. గత పాలకులు అమలు చేసిన దళారీ వ్యవస్థ దోపిడీని నిర్మూలించేందుకు ఈ నిర్ణయం తీసుకుంటే కాంగ్రెస్ నేతలకు కన్ను కొడుతుందని ధ్వజమెత్తారు. న్యాయస్థానం తీర్పుకు అనుగుణంగా విద్యుత్ ఒప్పంద కార్మికులకు జీతాల పెంపు ద్వారా న్యాయం చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. దళారీ వ్యవస్థను నిర్మూలించి కడుపులో పెట్టుకుంటామని భరోసా ఇచ్చారు. కోర్టు తీర్పును దృష్టిలో ఉంచుకొని హోం గార్డులకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.