తాడిపత్రి, ఫిబ్రవరి 26: తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గంలో కొంతమంది టీడీపీ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జేసీ దాయాది చిత్తరంజన్ రెడ్డి భవిష్యత్ కార్యాచరణను ప్రకటించడం వల్ల రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది. జేసీ సోదరులు 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరారు. అయితే జేసీ సోదరులు కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో టీడీపీలో ఉన్న క్యాడర్, నేతలు జేసీ సోదరులకు దూరంగా ఉంటున్నారు. జేసీ దాయాది చిత్తరంజన్ రెడ్డి మంగళవారం నాడు సమావేశం ఏర్పాటు చేసి టీడీపీలో ప్రాధాన్యత లేదని కార్యకర్తల సమావేశంలో ప్రకటించడం గమనార్హం. ఇప్పటికే బోగాటి నారాయణరెడ్డి పార్టీకి దూరమయ్యారు. గన్నెవారిపల్లి సర్పంచ్ రమణ జేసీకి దూరంగా ఉంటున్నట్టు ప్రచారం సాగుతోంది. గతంలోనే ఫయాజ్, జగదీశ్వర్ రెడ్డి, రంగనాథ్ లాంటి నేతలు కూడ జేసీ సోదరులకు దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. జేసీ సోదరులు ఏ పార్టీలో ఉన్నా కూడ వారికి ఓ వర్గం ఉంటుంది. కానీ, తమపై కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ బయటకు వెళ్తున్నా కూడ జేసీ సోదరులు మాత్రం స్పందించడం లేదు.