న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: మంగళవారం తెల్లవారుజామున ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దళాలు పాక్ ఆక్రమిత కశ్మీర్ లోకి చొరబడి మరీ ఉగ్రవాదులను మట్టుబెట్టి వారి స్థావరాలను నేలమట్టం చేసింది. ఈ దాడిలో భారీ ఎత్తున పేలుడు పదార్థాలతో ఉగ్ర స్థావరాలపై దాడులు జరపడంతో దాదాపు 300మంది ఉగ్రవాదులు మృతిచెందినట్లు తెలుస్తోంది. ఈ సర్జికల్ స్ట్రైక్స్ పై రిటైర్డ్ లెప్టినెంట్ జనరల్, 2016 సర్జికల్ స్ట్రైక్స్ సమయంలో ఆర్మీ కమాండర్ గా వ్యవహరించిన దీపేంద్ర హుడా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...పీవోకే లోని ఉగ్రవాద స్థావరాలపై భారత వాయుసేన జరిపిన ఈ దాడిపై ఆయన ప్రశంసలు కురిపించారు. పుల్వామాలో మన పైనికులను పొట్టనబెట్టుకున్న వారిపై ప్రతిదాడికి దిగితేనే సైనికుల్లో ఆత్మస్థైర్యం పెరుగుతుందని తాను భావించానని తెలిపారు. అందుకోసం భారత్ గతంలో 2016లో జరిపినట్లే సర్జికల్ స్ట్రైక్ కు దిగితే భావుంటుందని అనుకున్నానని...అలా చేస్తుందని కూడా ముందే ఊహించానన్నారు.
తాను అనుకున్నట్లే ఇవాళ మరో సర్జికల్ స్ట్రైక్ జరిగిందన్నారు. తెల్లవారుజామున భారత వాయుసేనకు చెందిన యుద్ద విమానాలు పీవోకేలోని ఉగ్ర స్థావరాలపై దాడులు జరిపి గట్టి హెచ్చరికలు పంపాయన్నారు. తమ జోలికి వస్తే చేతులు ముడుచుకుని కూర్చోకుండా ప్రతిదాడులకు దిగుతామని పాక్ వంటి ఉగ్రవాద దేశాలకు అర్థమయ్యేలా జవాబిచ్చారన్నారు. ఎల్వోసీలోకి వెళ్లి మరీ దాడులు చేసిన వాయయుసేన క్షేమంగా తిరిగిరావచ్చినందుకు చాలా ఆనందంగా వుందన్నారు. సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడమే కాదు వాటిని విజయవంతంగా అమలుపర్చి భారత ఆర్మీ తన సత్తా ఏంటో మరోసారి చాటిందని హుడా పేర్కొన్నారు.