ఇస్లామాబాద్, ఫిబ్రవరి 26: పాకిస్తాన్ ఉగ్రదాడికి ప్రతీకారంగా జైషే మహ్మద్ శిబిరాలే లక్ష్యంగా భారత సైన్యం జరిపిన దాడులపై పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ స్పందించారు. భారత వైమానిక దళాలు దాడి చేసిన విషయాన్ని ధ్రువీకరించారు. "భారత్ ఇలాంటి పని చేస్తుందని ప్రపంచానికి మేము చెబుతూనే ఉన్నాం. మా మాటలను ఈరోజు భారత్ నిజం చేసి చూపించింది. ఇప్పుడు వాళ్లకు సరైన సమాధానం చెప్పే హక్కు పొందాము. వాస్తవాధీన రేఖను దాటి భారత్ నిబంధనలు ఉల్లంఘించింది. ఆత్మరక్షణ హక్కు మాకు కూడా ఉంది కదా" అంటూ మహ్మద్ ఖురేషీ వ్యాఖ్యానించారు.
ఇటీవల పుల్వామా ఉగ్రదాడికి దీటుగా బదులిస్తామన్న భారత్ మాట నిలబెట్టుకుంది. 40 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న జైషే ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా భారత వాయుసేన మంగళవారం తెల్లవారుజామున మెరుపు దాడులు చేసింది. 12 మిరాజ్-2000 జెట్ ఫైటర్స్తో చేపట్టిన సర్జికల్ స్ట్రైక్-2 విజయవంతమైంది. ఈ దాడిలో దాదాపు 300 మంది ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో భారత్ చర్యపై అనుసరించాల్సిన విధానంపై చర్చించేందుకు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, మంత్రులు, ఆర్మీ అధికారులతో అత్యవసరంగా భేటీ అయ్యారు.