పాకిస్తాన్, ఫిబ్రవరి 26: జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మౌలనా మసూద్ అజహర్కు గట్టి షాక్ తగిలింది. ఈరోజు భారత వైమానిక దళాలు నిర్వహించిన దాడులలో మసూద్ బావమరిది యూసఫ్ అజహర్ హతమయ్యాడు. పాకిస్తాన్లోని ఖైబర్ ఫంక్తుఖ్వా ప్రావిన్స్లోని బాలాకోట్లో ఎయిర్ఫోర్స్ చేసిన దాడిలో జైషే మొహమ్మద్ అతిపెద్ద ఉగ్రవాద శిబిరం నేలమట్టమైంది. ఆ ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న మసూద్ బావమరిది యూసఫ్ అజహర్ అలియాస్ ఉస్తాద్ ఘోరీతో పాటు జైషే కమాండర్లు, ఉగ్రవాదులు, శిక్షకులు, జిహాదీలు హతమయ్యారు.
కొన్ని రోజుల ముందు భారత సైన్యం జరిపిన కాల్పుల్లో మసూద్ మేనల్లుళ్లు తాలా రషీద్, ఉస్మాన్ మృతి చెందారు. దీంతో రగిలిపోయిన మసూద్ వారి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని జైషే ఉగ్రవాదులకు సూచించాడు. దీనికి ప్రతీకారంగానే పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై దాడి జరిగింది. దీనికి సూత్రధారి అయిన జైషే టాప్ కమాండర్, మసూద్కు అత్యంత నమ్మకస్తుడైన అబ్దుల్ రషీద్ ఘాజీని సైన్యం 48 గంటల్లోనే మట్టుబెట్టింది.