అమరావతి, ఫిబ్రవరి 26: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగు దేశం పార్టీ రాజమండ్రి నుండి కొత్త ముఖాన్ని బరిలోకి దింపాలని చూస్తోంది. గతంతో పోలిస్తే ఈమధ్య చంద్రబాబు నాయుడు సిట్టింగ్లను నమ్మడం లేదు. ఎవరికి ఎక్కువ అనుకూలతలు వుంటే వాళ్లనే రంగంలోకి దింపాలని వ్యూహాలు పన్నుతున్నారు చంద్రబాబు. అలాగే, గెలుపు గుర్రాలు, సర్వేల్లో మంచి ఫలితాలు రాబట్టిన వారికే టికెట్లు ఇవ్వాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. దీంతో మురళీమోహన్కు ఎంపీ సీటు దక్కడం కష్టంగానే కనిపిస్తోంది.
మురళీమోహన్ చంద్రబాబుకు ఎంత సన్నిహితుడైనా గెలిచే అవకాశం లేదని తేలడంతో ఆ స్థానాన్ని మరొకరికి కేటాయించాలనే ఆలోచనలో వున్నారట. దీన్ని అదునుగా తీసుకుని తన కోడలు మాగంటి రూపను లైన్లోకి తీసుకొస్తున్నారు మురళీమోహన్. తనకు టికెట్ దక్కని పక్షంలో ఆ టికెట్ను కోడలు మాగంటి రూపకు ఇవ్వాలని గట్టిగా వాదిస్తున్నారట. చంద్రబాబు మాత్రం ఈ విషయం పట్ల ఇంకా స్పష్టత ఇవ్వలేదు. మాగంటి ఉమ ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందుగా గమనించి రాజమండ్రి గ్రామాల్లో జరిగిన పలు కార్యక్రమాల్లో గత రెండేళ్లుగా పాల్గొంటూ ఓటరు నాడిని పసిగట్టారని, ఈ దఫా ఆమెకు టీడీపీ ఎంపీ టికెట్ దక్కడం గ్యారంటీ అని రాజమండ్రి టీడీపీ శ్రేణుల్లో బలంగా వినిపిస్తోంది.