పాక్ పై వైమానిక దాడులు జరపడానికి కారణం ఇదే...

SMTV Desk 2019-02-26 12:53:37  Pakistan, India, Surgical Strike, Vijay Gokhale

న్యూడిల్లీ, ఫిబ్రవరి 26: ఈరోజు పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై భారత్ జరిపిన దాడిపై విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే మీడియాతో మాట్లాడారు. పుల్వామా దాడి తర్వాత ఉగ్రవాదులపై పాకిస్తాన్ చర్యలు తీసుకుంటుందని భావించామని, కానీ పాక్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతోనే భారత్ ఈ దాడులు చేయాల్సి వచ్చిందని విజయ్ గోఖలే తెలిపారు. భారత్ లో మరిన్ని ఆత్మాహుతి దాడులకు ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నారన్న పక్కా సమాచారం తమకు అందిందని, అందువల్లే వారు తెగబడక ముందే మట్టుబెట్టాలన్న నిర్ణయానికి వచ్చామని ఆయన స్పష్టం చేశారు.

బాలాకోట్ లోని జైషే మహమ్మద్ శిబిరంపై జరిపిన వైమానిక దాడిలో అధిక సంఖ్యలో ఉగ్రవాదులు మరణించారని, ఎంతమంది మరణించారనేది ఇంకా స్పష్టంగా తెలియలేదని ఆయన అన్నారు. ఆ ప్రాంతంలో ఉగ్రవాదులు బస చేసివున్నారన్న ఖచ్చితమైన సమాచారం తెలుసుకున్న తరువాతనే, సాధారణ ప్రజలకు ప్రాణనష్టం సంభవించకుండా జగ్రత్తలు తీసుకుని దాడి చేశామని విజయ్ గోఖలే తెలిపారు. భారత్ పై తెగించిన ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడులను నివారించేందుకే వైమానిక దాడులు చేయాల్సివచ్చిందని స్పష్టం చేశారు.

ఉగ్రవాదులకు పాకిస్తాన్ అండగా నిలుస్తుందని ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలకి తెలుసని, ఐఎస్ఐ అండ చూసుకుని రెచ్చిపోయే ఉగ్రవాదులకు గుణపాఠం చెప్పే తీరుతామని, అందులో భాగంగానే యుద్ధ విమానాలతో దాడులకు వెళ్లాల్సి వచ్చిందని ఆయన అన్నారు. కాశ్మీర్లో పాక్ ఆక్రమిత ప్రాంతాల్లో ఇంకా వందల కొద్దీ ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయని, ఒక్కో చోట పదుల సంఖ్యలో ఉగ్రవాదులు శిక్షణ పొందుతున్నారన్న సమాచారం తమ వద్ద ఉందని గోఖలే వెల్లడించారు. ఈ దాడితో బాలాకోట్ లో ఉన్న ఉగ్రవాద శిబిరం పూర్తిగా ధ్వంసమైందని ఇది మౌలానా మసూద్ అజర్ కు కోలుకోలేని దెబ్బేనని పేర్కొన్నారు. దాడిలో జైషే మొహమ్మద్ ఉగ్రవాద శిక్షకులు, సీనియర్ కమాండర్లు మరణించారని తెలిపారు.