పాకిస్తాన్ డ్రోన్ ను ధ్వంసం చేసిన భారత్

SMTV Desk 2019-02-26 12:51:55  Pakistan Drone, Indian Army, Gujarath-Pak border

గుజరాత్, ఫిబ్రవరి 26: ఈరోజు పాకిస్తాన్ పై భారత్ జరిపిన సర్జికల్ స్ట్రైక్ తో ఇరు దేశాల మద్య యుద్ధ వాతావరణం నెలకొంది. దేశ సరిహద్దుల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అని భారత సైన్యం అప్రమత్తంగా ఉంది. కాశ్మీర్ లోని సరిహద్దులలోనే కాకుండా దేశం నలువైపులా భద్రతను కట్టుదిట్టం చేసారు. ఈ నేపథ్యంలో పుల్వామా ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందని ముందే పసిగట్టిన పాకిస్థాన్... డ్రోన్ల ద్వారా మన సరిహద్లులపై నిఘా వేసింది.

ఈ క్రమంలో పాక్ కి సంబంధించిన డ్రోన్ ను భారత సైన్యం ద్వంసం చేసింది. ఈరోజు ఉదయం 6.30 గంటల సమయంలో గుజరాత్-పాక్ సరిహద్దుల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ డ్రోన్ ను భారత సైన్యం కనిపెట్టింది. అత్యాధునిక సాంకేతికత సాయంతో డ్రోన్ ను గాల్లోనే పేల్చివేసింది. పాక్ పై వాయుసేన దాడుల నేపథ్యంలో, సరిహద్దుల్లో ఉన్న అన్ని ప్రాంతాల్లో భారత్ హైఅలర్ట్ ప్రకటించింది.