పక్క ప్లాన్ తో దాడి!

SMTV Desk 2019-02-26 12:45:57  Attack, Plan, Three Attacks, War Aeroplane

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: ఈ తెల్లవారుజామున భారత జవాన్లు పాక్ ఆక్రమిత కాశ్మీర్ పై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిపై భారత జవాన్లు ముందే వ్యూహాలు పన్నారు. మూడు ప్రాంతాల్లోని ఉగ్రవాద శిబిరాలు టార్గెట్ చేసి, ఎక్కడ బాంబు దాడులు చేయాలో ముందుగానే నిర్ణయించుకున్నారు. కాగా, శ్రీనగర్ సమీపంలోని ఎయిర్ ఫోర్స్ బేస్ నుండి మిరేజ్ యుద్ధ విమానాలు టేకాఫ్ అయ్యాయి. బాలాకోట్ ప్రాంతంలోని ఉగ్రవాద శిబిరంపై తెల్లవారుజామున 3.45 గంటల నుంచి 3.53 గంటల మధ్య తొలి దాడి జరిగింది. తరువాత భారత వాయుసేన విమానాలు బాలాకోట్ ను చేరిన మూడు నిమిషాల వ్యవధిలో మరో నాలుగు విమానాలు ముజఫరాబాద్ కు వెళ్లాయి. అక్కడి ఉగ్రవాద శిబిరంపై 3.48 గంటల నుంచి 3.58 గంటల మధ్య దాడులు జరిగాయి. మూడవ దాడిలో భాగంగా చకోటీ ప్రాంతానికి వెళ్లిన ఫైటర్ జెట్స్ 3.58 నుంచి 4.04 గంటల మధ్య బాంబుల వర్షం కురిపించాయి. ఆపై 4.12 నుంచి 4.15 గంటల కెల్లా అన్ని విమానాలూ ఎయిర్ బేస్ కు చేరుకున్నాయి. తాము దాడి చేయాలనుకున్న ప్రాంతాలను యుద్ధ విమానాలు ఆటోమేటిక్ గా గుర్తించాయని, సరిగ్గా ఆ ప్రాంతంలోనే బాంబులను వేసి వచ్చాయని సైన్యాధికారి ఒకరు ప్రకటించారు.