అమరావతి, ఫిబ్రవరి 26: ఇటీవల సాక్షి టీవీ చానల్ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు రచ్చబండ ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి యాంకర్ గా సినీ నటి రేణూ దేశాయ్ వ్యవహరిస్తున్నారు. అయితే, రేణూ దేశాయ్ కర్నూలు జిల్లా తంబళబీడు పర్యటనలో ఉండగా, రైతులు చెప్పిన సమస్యలు విని కన్నీరు పెట్టుకున్నారు. పెదకడబూరు గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న పెద్ద రంగన్న అనే రైతు ఇంటికి వెళ్లిన ఆమె, జిల్లాలో కరవు నేపథ్యంలో రైతులు పడుతున్న కష్టాలు, ఆత్మహత్యలకు దారితీస్తున్న పరిస్థితులపై అధ్యయనం చేశారు. వారికీ కనీసం తాగేందుకు మంచినీరు లేదని, పక్కా గృహాలు లేవని, బ్యాంకు రుణాలను చెల్లించలేకున్నామని రైతులు తమ సమస్యలు చెప్పుకున్నారు. పండిన పంటలకు గిట్టుబాటు ధర లేదని చెప్పారు. సమస్యలపై స్పందించిన రేణు, తాను ప్రజా ప్రతినిధిని, అధికారిణిని కాదని, అయినా, ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకెళ్లి న్యాయం జరిగేందుకు తనవంతు కృషి చేస్తానని చెప్పారు.