బంగ్లాదేశ్, ఫిబ్రవరి 25: విమానాన్ని హైజాక్ చేసేందుకు ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయాడు ఓ వ్యక్తి. భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఈ దుండగుడు మరణించాడు. నిన్న మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటన విమాన ప్రయాణికులను తీవ్ర కలకలం రేపింది. కాగా ఈ హైజాక్ వెనుక ఎటువంటి ఉగ్రవాద సంబంధాలు లేవు అని అధికారులు వెల్లడించారు. కేవలం తన భార్యతో ఉన్న విభేదాల వల్ల మతిస్థిమితం కోల్పోయి హైజాక్ కు ప్రయత్నించాడు అని ప్రకటించారు. అయితే విమానంలోకి తుపాకీ, పేలుడు పదార్థాలు ఎలా వచ్చాయనే అంశంపై దర్యాప్తు ప్రారంభించారు. సంబంధిత అధికారుల కథనం ప్రకారం...ఆదివారం మధ్యాహ్నం ఓ దుండగుడు బిమాన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానాన్ని హైజాక్ చేసేందుకు ప్రయత్నించాడు. ఢాకా నుంచి చిట్టగాంగ్ మీదుగా దుబాయ్ వెళ్తున్న.. బీజీ147 విమానం 145మందికిపైగా ప్రయాణికులతో బయల్దేరింది.
కాసేపటి తరువాత ఓ ప్రయాణికుడు తుపాకీతో కాక్పిట్లోకి చొరబడి.. బాంబు ఉందంటూ బెదిరించాడు. అతని బెదిరింపులతో పైలట్లు చిట్టగాంగ్ విమానాశ్రయంలో ఫ్లైట్ను అత్యవసరంగా దించారు. ఎయిర్పోర్టులో విమానం దిగగానే.. భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఎయిర్పోర్టులో హైజాకర్తో అధికారులు చర్చలు జరిపారు. అతడు బంగ్లాదేశ్ ప్రధానితో మాట్లాడాలని కోరగా.. ముందు ప్రయాణికుల్ని విమానం నుంచి దింపేయాలని అధికారులు విజ్ఞప్తి చేయడంతో ఒప్పుకున్నాడు. వెంటనే ప్రయాణికుల్ని అత్యవసర ద్వారం నుంచి బయటకు సురక్షితంగా తీసుకొచ్చారు. తర్వాత కమాండోలు హైజాకర్ను లొంగిపోవాలని హెచ్చరించినా.. నిరాకరించడంతో కాల్పులు జరిపాల్సి వచ్చింది.ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన అతడు ప్రాణాలు కోల్పోయాడు.హైజాకర్ను బంగ్లాదేశ్కు చెందిన మహదిగా గుర్తించారు.