మాటకు కట్టుబడే వున్నా: ఇమ్రాన్ ఖాన్

SMTV Desk 2019-02-25 13:32:14  Imran Khan, Narendra Modi, Terrorist Attack, Proof, Patan

ఇస్లామాబాద్, ఫిబ్రవరి 25: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుల్వామా ఉగ్రదాడి పాకిస్తాన్ ఉగ్రవాదులు చేశారని తెలిసిందే. కాగా ఈ విషయం పట్ల పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ పాక్‌ ప్రమేయంపై ఆధారాలుంటే ఇవ్వాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 14న జరిగిన ఈ ఉగ్రదాడిలో 44 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన రెండు దేశాల మధ్య ఉద్రిక్తతకు దారితీసింది. ఉగ్రదాడులను భరిస్తూ కూర్చునే ప్రభుత్వం తమది కాదని, ప్రతీకారం తీర్చుకుంటామని మోదీ హెచ్చరించగా, దాడిచేస్తే తిప్పికొడతామని పాక్‌ బదులిచ్చింది.

ఈ సందర్భంగా భారత్‌ ప్రధాని మోదీ స్పందిస్తూ "పాకిస్థాన్‌ ప్రధానిగా ఇమ్రాన్‌ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఫోన్‌ చేసి అభినందనలు తెలియజేశాను. ఇన్నాళ్లు పోట్లాడుకున్నామని, ఇకపై పేదరికం, నిరక్షరాస్యత నిర్మూలనకు ఐక్యంగా కృషి చేద్దామని కోరాను. ఇమ్రాన్‌ స్పందిస్తూ తాను పఠాన్‌ కుమారుడినని, అబద్ధాలు చెప్పనని ఆ సందర్భంలో అన్నారు. ఆ మాటను ఇప్పుడు నిబెట్టుకుంటారో? లేదో చూడాలి" అని గుర్తుచేశారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన పాక్ ప్రధాని కార్యాలయం, ఇప్పటికీ అదేమాటకు కట్టుబడి ఉన్నానని, ఆధారాలు చూపాలని కోరింది. ఇరుదేశాల మధ్య శాంతిసౌభ్రాతృత్వాల కోసం భారత ప్రధాని ఓ అవకాశం ఇవ్వాలని ఇమ్రాన్‌ విజ్ఞప్తి చేశారు.