అమరావతి, ఫిబ్రవరి 25: చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చుక్కెదురైంది. ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. చంద్రగిరిలో సర్వే వివాదంలో చెవిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. పాకాలలో సర్వే చేస్తున్నవారిని అడ్డుకొని ట్యాబ్లు లాక్కొని వారిని అరెస్ట్ చేసి చిత్తూరు పీటీసీకి తరలించారు. అయితే అరెస్ట్ చేసినవారిని పీటీసీలో పెట్టే అధికారం లేదంటూ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎన్నికల కమిషన్కు కూడా ఫిర్యాదు చేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అర్ధరాత్రి అరెస్ట్ చేసి సత్యవేడు పోలీస్ స్టేషన్కు తరలించారు. కాగా, తనను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పకుండా పోలీసులు వేధిస్తున్నారంటూ స్టేషన్లోనే నిరసనకు దిగారు. సత్యవేడు పోలీస్ స్టేషన్ ఎదుట భారీగా పోలీసులను మోహరించారు. వైసీపీ కార్యకర్తలతో పాటు అక్కడకు పోటా పోటీగా టీడీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఏఎస్పీ సుప్రజ అదనపు బలగాలను మోహరించారు.