విశాఖపట్నం, ఫిబ్రవరి 24: ఆస్ట్రేలియాతో విశాఖ వేదికగా జరిగిన తొలి టి20 మ్యాచ్ లో టీమిండియా ఓటమిపాలైంది. 127 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన ఆసీస్, ఇన్నింగ్స్ ఆఖరి బంతికి రెండు పరుగులు తీసి విజయం సాధించింది. చివరి ఓవర్ లో కంగారూల గెలుపునకు 14 పరుగులు అవసరం కాగా కమ్మిన్స్, రిచర్డ్సన్ జోడీ చెరో ఫోర్ కొట్టి మ్యాచ్ ను భారత్ నుంచి లాగేసుకున్నారు. నిన్న జరిగిన ఈ మ్యాచ్ లో మొదట భారత్ టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 126 పరుగులు చేసింది, కే యల్ రాహుల్ ( 50 )ఒక్కడే రాణించాడు. ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆసీస్ కు ఓపెనర్ డార్సీ షార్ట్ 37, గ్లెన్ మ్యాక్స్ వెల్ 56 పరుగులతో విజయానికి బాటలు వేశారు. టీమిండియా బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు తీశాడు. ఇన్నింగ్స్ 19వ ఓవర్లో బుమ్రా వరుస బంతుల్లో హ్యాండ్స్ కోంబ్, కౌల్టర్ నైల్ లను వెనక్కి పంపినా ప్రయోజనం లేకపోయింది.