రాజమండ్రి, ఫిబ్రవరి 24: కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకి ప్రధాని అయ్యే అవకాశమే లేదు అలాంటప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ఎలా ఇవ్వగలరని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. ఆదివారం రాజమండ్రిలో జరిగిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్-సేవ్ డెమోక్రసీ’ సదస్సులో పాల్గొని మాట్లాడిన ఉండవల్లి, కేంద్రంలో ప్రభుత్వం మారితే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని రాహుల్ అన్నారని, అదెలా సాధ్యమని అడిగారు.
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కి 150 మించి స్థానాలు రావని, 250 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే తప్ప రాహుల్ సీఎం కాలేరని ఉండవల్లి అన్నారు. కాంగ్రెస్కు ఏ పార్టీ మద్దతు ఇస్తుందని, హోదా ఎలా ఇవ్వగలుగుతారని కాంగ్రెస్ చీఫ్ను ప్రశ్నించారు. ఇక, ఏపీ సీఎం చంద్రబాబుపైనా ఉండవల్లి తీవ్ర విమర్శలు చేశారు.
ఏపీలో ఏడు మండలాలను విలీనం చేయడం..... చంద్రబాబు తన గొప్ప ఘనతగా చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. భద్రాచలం ఏపీదేనని, అది లేకుండా ఏడు మండలాలను విలీనం చేయడం వల్ల సాధించిన ఘనత ఏంటని సీఎంను ప్రశ్నించారు. చంద్రబాబు ప్రసంగం మంచి ఎంటర్టైన్మెంట్ అని, ఆయన ప్రసంగిస్తుంటే హాయిగా నిద్రపోవచ్చని ఉండవల్లి సెటైర్ వేశారు.