‘గోల్కొండ సింహం’బీజేపీ సీనియర్ నేత బద్దం బాల్‌రెడ్డి కన్ను మూత...

SMTV Desk 2019-02-23 19:04:00  baddam balreddy, bjp, bjp senior leader, Golconda lion, baddam balreddy dead

హైదరాబాద్, ఫిబ్రవరి 23: బీజేపీ సీనియర్‌ నేత, ‘గోల్కొండ సింహం’గా పిలుచుకునే బద్దం బాల్‌రెడ్డి (72) ఆరోగ్యం మరింత విషమించడంతో కొద్ది సేపటిక్రితం కన్ను మూశారు. కొద్ది రోజుల క్రితం కేన్సర్‌తో బాధ పడుతున్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రిలో చేర్చించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి శనివారం (ఫిబ్రవరి 23) మధ్యాహ్నం మరింత విషమించినట్లు వైద్యులు తెలిపారు. బద్దం బాల్ ‌రెడ్డి మరణ వార్తతో బీజేపీ నేతలు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే కిషన్‌ రెడ్డి, లక్ష్మణ్‌ తదితర నేతలు కేర్ ఆస్పత్రికి చేరుకున్నారు.

బీజేపీలో సాధారణ స్థాయి నుంచి రాష్ట్రంలో ప్రముఖ రాజకీయ నేతగా ఎదిగిన బద్దం బాల్‌రెడ్డి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1985 నుంచి 1994 వరకు కార్వాన్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 3 సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తెలంగాణ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాజేంద్రనగర్ నుంచి బీజేపీ తరుఫున ఆయన పోటీ చేసి పరాజయం పాలయ్యారు. కార్వాన్‌ నియోజకవర్గంలో ఆది నుంచి ఎంఐఎం ప్రభావం ఎక్కువ. ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న ఆ నియోజక వర్గం నుంచి గెలుపొందిన బీజేపీ అభ్యర్థిగా బద్దం బాల్ రెడ్డి రికార్డు సృష్టించారు. హైదరాబాద్ పాతబస్తీలో బీజేపీ ప్రాబల్యం పెంచిన వారిలో బాల్ రెడ్డి ఒకరు. ఈ నేపథ్యంలో అభిమానులు ఆయణ్ని ‘గోల్కొండ సింహం’గా పిలుచుకుంటారు.