న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తన యాప్ నుండి దాదాపు 5000 రెస్టారెంట్లను తీసేస్తున్నట్లు ప్రకటించింది. ఆహార నాణ్యత విషయంలో సరైన ప్రమాణాలు లేని కారణంగా ఈ నెల చివరి లోపు పలు రెస్టారెంట్లను యాప్, వెబ్ సైట్ నుంచి తోలిగిస్తోంది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలను ఆయా రెస్టారెంట్లు అందుకోలేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇకపై ఎఫ్ఎస్ఎస్ఏఐ నిబంధనలను తూ.చ. తప్పకుండా అమలు చేస్తామని స్పష్టం చేసింది. తమతో ఒప్పందం చేసుకున్న సంస్థల్లో గత కొంత కాలంగా నాణ్యతా ప్రమాణాలను తనిఖీ చేస్తున్నట్లు జొమాటో వెల్లడించింది.
దేశంలోని మొత్తం 150 పట్టణాల్లో తమతో ఒప్పందం చేసుకున్న రెస్టారెంట్లు, హోటళ్లలో నాణ్యతా ప్రమాణాలను తనిఖీ చేయనున్నట్లు తెలిపింది. ఈ అంశంపై జొమాటో సీఈవో మోహిత్ గుప్తా మాట్లాడారు. జొమాటో జాబితాలోకి రోజు కొత్తగా 400 రెస్టారెంట్లు వచ్చిచేరుతున్నాయని.. ఈ నేపథ్యంలో రెస్టారెంట్ల నాణ్యతా ప్రమాణాలపై కీలకంగా దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ‘80,000లకు పైగా రెస్టారెంట్లు మాతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ రెస్టారెంట్లలో నాణ్యతా ప్రమాణాలు పరిశీలించాలనుకుంటున్నాం. ఎఫ్ఎస్ఎస్ఏఐ నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలను అందుకునేందుకు ఆయా రెస్టారెంట్లకు సాయం చేస్తాం’ అని మోహిత్ గుప్తా అన్నారు.