నెల్లూరు, ఫిబ్రవరి 22: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈరోజు నెల్లూరుకు చేరుకున్నారు. మొదటగా చెన్నై వెళ్ళిన రాష్ట్రపతి అక్కడి నుండి నేరుగా హెలికాప్టర్ లో నెల్లూరులోని పోలీస్ కవాతు మైదానంలో దిగారు. కోవింద్ కు ఆంధ్రప్రదేశ్ మంత్రులు సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, నారాయణ ఘన స్వాగతం పలికారు. తరువాత ఆయన నేరుగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాసానికి వెళ్ళారు. ఈ పర్యటన లో భాగంగా రాష్ట్రపతి పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. వెంకటాచలం అక్షర విద్యాలయంలో విద్యార్థులను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించనున్నారు. తరువాత అక్కడి విద్యార్థులతో ముచ్చటించనున్నారు. అనంతరం స్వర్ణభారత్ ట్రస్టు వార్షికోత్సవ కార్యక్రమానికి హాజరుకానున్నారు. కాగా, రాష్ట్రపతి నెల్లూరు పర్యటన నేపథ్యంలో అధికారులు ఆ ప్రాంతంలో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.